ఆగస్టు 1న శ్రీశైలం డ్యామ్ వద్దకు సీఎం చంద్రబాబు

శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. తాజాగా అధికారులు మరో రెండు గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

Chandrababu
Srisailam
Krishna River
TDP
Andhra Pradesh

More Telugu News